తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం రాత్రి శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం ఆలయ మర్యాదలతో నరసింహతీర్థం నుండి ఆలయానికి తీర్థాన్ని తీసుకొచ్చారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు యాగశాలలో అగ్నిప్రతిష్ఠ, చతుర్దశకలశస్నపన తిరుమంజనం నిర్వహించారు.
రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. ఆ తరువాత రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులు, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీఆంజనేయస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.

