ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం ఉదయం నవనీతకృష్ణాలంకారంలో రాములవారు ముగ్ధమనోహరంగా దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
పురాణాల ప్రకారం.. కృష్ణుడు వెన్నదొంగ. రేపల్లెలో బాలకృష్ణుడు యశోదమ్మ ఇంట్లోనే గాక అందరి ఇళ్లలో దూరి వెన్న ఆరగించేవాడు. ఈ చిన్నికృష్ణుడి లీలలను గుర్తు చేస్తూ రాములవారు వెన్నకుండతో భక్తులకు దర్శనమిచ్చాడు.
అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఆలయంలో స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు వేడుకగా అభిషేకం చేశారు. సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు ఊంజల్సేవ వైభవంగా జరగనుంది.
భక్తిభావాన్ని పంచిన ధార్మిక కార్యక్రమాలు
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మూెత్సవాల్లో నాలుగో రోజైన బుధవారం టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు భక్తిభావాన్ని పంచాయి.
ఉదయం 7 నుంచి 8 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని, ఉదయం 10 నుంచి 11 గంటల వరకు డా.. ఎ.వి.కిరణ్ ఆళ్వారుల పాశురాలలో శ్రీరాముడు అనే అంశంపై ధార్మికోపన్యాసం చేశారు. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఊంజల్సేవలో శ్రీ ఎం.బి.లోకనాథంరెడ్డి బృందం పలు భక్తి సంకీర్తనలు ఆలపించనున్నారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు శ్రీమతి ఎం.శారద భాగవతారిణి హరికథ వినిపిస్తారు.

