శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా ముగిసిన”బాలాలయ సంప్రోక్షణ”

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బాలాలయ సంప్రోక్షణ సోమవారం ఉదయం పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.

జీర్ణోద్ధరణ తరువాతే మూలమూర్తి దర్శనం

ఆలయంలో ఏర్పాటుచేసిన బాలాలయంలో మధ్యాహ్నం 12.00 గంటల నుండి భక్తులను శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి అనుమతించారు. స్వామివారి గర్భాలయంలో జీర్ణోద్ధరణ పనుల కారణంగా జీర్ణోదరణ పనుల తర్వాత మూలమూర్తి దర్శనం కల్పిస్తారు. అంతవరకు భక్తులు బాలాలయంలో స్వామివారిని దర్శించుకోవచ్చు.

టిటిడి అనుబంధ ఆలయాలలో ప్రతి 12 సంవత్సరాలకోసారి అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణనను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో 2006వ సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ జీర్ణోదరణలో భాగంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి గర్భాలయం, విమాన శిఖరం, రాజ గోపురం జీర్ణోద్ధరణ (ఆధునీకరణ పనులు) కార్యక్రమాలు దాదాపు నెల రోజుల పాటు జరుగుతాయి. ఇందులో భాగంగా విమాన శిఖరంపై నూతన దేవతా మూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేయడం, విమాన శిఖరం మరియు రాజగోపురంపై రాగి కలశాల స్థానంలో మొదటిసారిగా బంగారు పూత పూయబడిన కలశాలు అమరుస్తారు.

అదేవిధంగా గర్భాలయం పైభాగాన గల బ్రహ్మరంధ్రం వద్ద ఉన్న చెక్కను పరిశీలించడం, ఆలయంలో నూతన మకర తోరణం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆలయంలోని ద్వారపాలకులు, గరుడాళ్వారు, ఆళ్వార్లు, ధ్వజస్తంభం, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీఆండాళ్‌ అమ్మవారి ఆలయం, శ్రీప్రసన్న ఆంజనేయస్వామివారి ఆలయాలలో మరమత్తులు చేపట్టనున్నారు.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *