స్వర్ణరథంపై కాంతులీనిన కల్యాణ వెంకన్న


శ్రీ‌నివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్ర‌వారం సాయంత్రం 5.00 గంటల నుండి 6.00 గంటల వరకు స్వర్ణరథోత్సవం కన్నులపండుగగా జరిగింది. శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ధగధగా మెరిసిపోతున్న స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహించాడు. వాహనసేవ ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.





శ్రీవారికి శ్రీభూదేవులు ఇరుప్రక్కలా ఉంటారు. శ్రీదేవి(లక్ష్మి) బంగారుకాగా – ఆమెను భరించే స్వామికి బంగారు రథంలో ఊరేగడం ఎంతో ఆనందం. బంగారం శరీరాన్ని తాకుతుంటే శరీరంలో రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. బంగారం మహాశక్తిమంతమైన లోహం. స్వామివారికి కృష్ణావతారంలో దారుకుడు సారథి, కాగా శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకాలనేవి నాల్గుగుర్రాలు. శ్రీవారి ఇల్లు, ఇల్లాలు బంగారం, ఇంట పాత్రలు బంగారం. సింహాసనం బంగామే. స్వర్ణరథం శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైనది.





‘స్వర్ణ’ మంటే ‘బాగా ప్రకాశించేది’ అని వ్యుత్పత్తి. స్వర్ణం లభించేది భూమినుండే. కనుక ఇరువైపులా శ్రీదేవి, భూదేవీ ఉండగా శ్రీవారుమధ్యలో ఉండి, స్వర్ణరథంలో ఊరేగడం – స్వామివారి మహోన్నతినీ, సార్వభౌమత్వాన్నీ, శ్రీసతిత్వాన్నీ, భూదేవీనాథత్వాన్నీ సూచిస్తూంది.





ఈ స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో బంగారు, మణులు, సంపదలు, భోగభాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయి.





Source


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *