వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం ఎక్కువ మంది వయో వృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు కల్పించాలన్న ఉన్నతాశయంతో టిటిడి ప్రతి నెలా రెండు సామాన్య దినాలలో వీరికి ప్రత్యేక దర్శనాలను కల్పిస్తోంది.

ఇందులో భాగంగా మార్చి 6, 20వ తేదీల్లో వయోవృద్ధులు(65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3.00 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తున్న విషయం విదితమే. భక్తుల కోరిక మేరకు మరింత మందికి స్వామివారి దర్శనం కల్పించేందుకు నెలలో రెండు రోజులపాటు టిటిడి అదనంగా దర్శన టోకెన్లు జారీ చేస్తోంది.

అదేవిధంగా 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను మార్చి 7, 21వ తేదీల్లో ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *