శ్రావణమాసంలో చేసే పూజల్లో నాగేంద్రుని పూజ కూడా చాలా విశిష్టతను సంతరించుకున్నది. ఈ మాసంలో వచ్చే 5వ రోజును ”నాగ పంచమి”గాను ”గరుడ పంచమి”గా పిలుస్తారు. భారతీయ సంస్కృతిలో ”నాగ పూజ” కి ఒక గొప్ప విశిష్టత ఉంది. అందులోనూ శ్రావణ శుద్ధ పంచమి నాడు చేసే ‘నాగ పంచమి’ అత్యంత విశిష్టతను సంతరించుకుంది. ఈ పర్వదిన ప్రాముఖ్యతని సాక్షాత్ పరమశివుడే స్కంద పురాణములో వివరించాడు.
నాగ పూజా ప్రాధాన్యత
ఆదిశేషుని సేవకు మెచ్చిన విష్ణుమూర్తి ఏదైనా వరం కోరుకోమన్నాడు. అందుకు ఆనందంతో ”తాము ఉద్భ వించిన పంచమి రోజు సృష్టిలోని మానవాళి సర్ప పూజలు చేయాలని” ఆదిశేషుడు వరం కోరుకున్నాడు. ఆదిశేషుని కోరికని మన్నించి మహావిష్ణువు ఈ నాగుల పంచమి రోజు సర్ప పూజలు అందరూ చేస్తారని వరాన్ని ప్రసాదించాడనేది ఈ వేళకు ఉన్న విశేషం.
ఇలా పూజించండి…
నాగపంచమి రోజు నాగులని పూజించి, గోధుమతో చేసిన పాయసాన్ని నైవేద్యముగా పెట్టాలి. నాగ పంచమి రోజు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనము చేయాలి.
”విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాః,
న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్||
అనే ఈ మంత్రాన్ని చదువుతూ పుట్టలో పాలు పొయ్యాలి. నాగ పంచమి రోజున పూజ చేసిన వారికి విష భాధలు ఉండవు. సర్ప స్తోత్రాన్ని నాగ పంచమి రోజున చదివిన వారికి ఇంద్రియాల వల్ల ఎలాంటి బాధలు లేక ఇబ్బందులు రావు. సంతానోత్పత్తి, వంశాభివృద్ధి, కార్యసిద్ధి కలుగుతాయి. అంతేకాకుండా కాలసర్ప దోషాలు, నాగ దోషాలు ఉన్నా తొలగిపోతాయని పురాణోక్తి.
https://youtu.be/DGP_OnkWhA8

