జూలై 13 నుండి 15వ తేదీ వరకు తిరుమలలో శ్రీ జయతీర్ధుల ఆరాధనోత్సవాలు

కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూలై 13 నుంచి 15వ తేదీ వరకు శ్రీ జయతీర్థుల ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఇందుకోసం తిరుమలలోని ఆస్థానమండపంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఇందులోభాగంగా మూడు రోజుల పాటు ఆస్థానమండపంలో ఉదయం 5.30 నుంచి 7.00 గంటల వరకు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన భజనమండళ్లతో సుప్రభాతం, ధ్యానం నిర్వహిస్తారు. పీఠాధిపతుల మంగళాశాసనాలు అందిస్తారు. ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు దాస సాహిత్య కళాకారులతో ‘శ్రీ జయతీర్థుల సంకీర్తన”, ఉదయం 10.30 నుండి 12.30 గంటల వరకు పండితులతో ఆధ్యాత్మిక – ధార్మిక సందేశాలు ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సామూహిక సంకీర్తన, సంగీత విభావరి కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఈ సందర్భంగా జూలై 13వ తేదీ ఉడిపికి చెందిన శ్రీశ్రీశ్రీ రఘువరేంద్రతీర్థ స్వామీజీ, జూలై 14న కొక్కె సుబ్రహ్మణ్య క్షేత్రానికి చెందిన శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ, జూలై 15న బెంగళూరుకు చెందిన శ్రీశ్రీశ్రీ సువిద్యేంద్రతీర్థ స్వామీజీ మంగళాశాసనాలు ఇవ్వనున్నారు. అనంతరం టిటిడి ఉన్నతాధికారులు, ప్రముఖులు ప్రసంగిస్తారు.

చారిత్రక ప్రాశస్త్యం

ద్వైతసిద్ధాంత ప్రతిష్టాపనాచార్యులైన శ్రీ మధ్వాచార్యులు ఆసేతు హిమాచలం సంచరించి శిష్యులకు సత్‌ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ 37 గ్రంథాలకు పైగా రచించారు. శ్రీవారి భక్తుడైన శ్రీ జయతీర్థులవారు పూర్వజన్మలో వ షభరూపంలో శ్రీ మధ్వాచార్యుల సన్నిధిలో ఉంటూ ద్వైత సిద్ధాంతభావాన్ని పూర్తిగా శ్రవణం చేసిన ప్రభావంతో తరువాత జన్మలో ఈ గ్రంథాలకు ‘న్యాయసుధ’ పేరుతో వ్యాఖ్యాన గ్రంథాన్ని రచించారు. సంస్కృతంలో ‘టీకా’ అంటే వ్యాఖ్యానం అని అర్థం. కావున ఈయనకు టీకాచార్యులనే పేరు వచ్చింది. వీరి సాహిత్యాన్ని శ్రీపురందరదాస గ్రహించి వేల కీర్తనలు రచించారు. మధ్వాచార్యులు మొత్తం 22 గ్రంథాలను రచించారు. వీటిలో న్యాయసుధ, తత్వప్రకాశిక, ప్రమేయదీపిక, న్యాయదీపిక గ్రంథాలు ముఖ్యమైనవి.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *