ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం

చిత్రాపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 5.00 గంటలకు ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి, ఆండాల్‌ అమ్మవారు, శ్రీకృష్ణస్వామి, విష్వక్సేనులవారు తదితర తొమ్మిది మంది దేవేరుల ఊరేగింపు ప్రారంభమైంది. ఉదయం 7.00 గంటలకు తనపల్లి రోడ్డులో గల పొన్నకాల్వ మండపానికి ఊరేగింపు చేరుకుంది.

tiruchanoor ponnakalva utsavam

అనంతరం అక్కడ ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ళతో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు అభిషేకం చేశారు. అనంతరం వాహన మండపంలో సేవాకాలం, శాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు.

సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు ఊంజలసేవ, ఆస్థానం నిర్వహించారు. ఆ తరువాత సాయంత్రం 5.30 గంటలకు శ్రీగోవిందరాజస్వామివారు అక్కడినుండి బయలుదేరి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. గోవిందరాజస్వామివారు వచ్చే సమయంలో అమ్మవారి ఆలయంలో ఒక తలుపు మూసి ఉంచుతారు.

బావగారైన గోవిందరాజస్వామివారు వచ్చారని పద్మావతి అమ్మవారు లోపలి నుండి ఆసక్తిగా తొంగి చూస్తారని, అందుకే ఆలయం ఒక తలుపు మూసి ఉంచుతారని పురాణాల ద్వారా తెలుస్తోంది. అక్కడ పూజాధికాలు ముగించుకుని గోవిందరాజస్వామివారు ఊరేగింపుగా బయలుదేరి రాత్రి 9.30 గంటలకు తిరిగి శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకోవడంతో పొన్నకాల్వ ఉత్సవం ముగిసింది.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *