ఘనంగా చక్రతీర్థ ముక్కోటి

తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి గురువారం నాడు ఘనంగా జరిగింది. ప్రతి ఏడాదీ కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు ఆధ్వర్యంలో, పార్‌పత్తేదార్‌ శ్రీ రామచంద్ర, అర్చకులు, పరిచారకులు, భక్తులు ఉదయం మంగళవాయిద్యాల నడుమ స్వామివారిని ఆలయం నుండి ఊరేగింపుగా చక్రతీర్థానికి తీసుకెళ్లారు. అక్కడ శ్రీ చక్రత్తాళ్వారుకు, నరసింహస్వామివారికి, ఆంజనేయస్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం మరియు ఆరాధన చేపట్టారు. హారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

పురాణ నేపథ్యంలో స్కంద పురాణానుసారం పద్మనాభ మహర్షి అనే యోగి చక్రతీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చి శంఖు, చక్ర, గధా భూషితుడైన శ్రీవేంకటేశ్వరస్వామివారు ఆతనికి ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాల్సిందిగా చెప్పి అంతర్థానమయ్యాడు. పద్మనాభ మహర్షి స్వామి ఆజ్ఞానుసారం చక్రతీర్థంలో తపస్సు చేశాడు.

అయితే ఒకనాడు ఓ రాక్షసుడు అతనిని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించాడు. అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరించాడు. ఆ తరువాత ఆ మహర్షి శ్రీ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని కోరాడు. భక్తవల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండే విధంగా ఆజ్ఞాపించడంతో ఈ తీర్థం చక్రతీర్థంగా సుప్రసిద్ధిగాంచింది.

వరాహ పూరాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలసివున్న 66కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనవిగా చెప్పబడే సప్త తీర్థాలలో చక్రతీర్థాన్ని కూడా చేర్చి ప్రవరతీర్థంగా పేర్కొన్నారు.
Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *