కంచిపీఠానికి ఉత్తరాధికారిగా శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి

 

శ్రీ కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ ద్రావిడ్ సన్యాస దీక్ష స్వీకరించారు. కుటుంబసభ్యుల సమక్షంలో తమిళనాడులోని కంచి పీఠంలో ప్రస్తుత పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి సన్యాస దీక్ష ప్రసాదించారు. ఆదిశంకరుల అనుగ్రహంతో అన్నవరం క్షేత్రానికి చెందిన గణేశ శర్మకు ఇంతటి పవిత్ర బాధ్యత నెరవేర్చే అవకాశం లభించడం మన రాష్ట్రానికే గర్వకారణం.

తమిళనాడులోని కంచి కామకోటి 71వ పీఠాధిపతిగా ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం క్షేత్రానికి చెంది దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ సన్యాస దీక్ష కార్యక్రమం ఏప్రిల్ 30న ఘనంగా జరిగింది. తల్లిదండ్రులు దుడ్డు మంగదేవి, ధన్వంతరి, కుటుంసభ్యులతో కలిసి ఈ నెల 26న కంచి చేరుకోగా.. ప్రస్తుత పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి శంకర మఠంలో గణపతి, సుబ్రమణ్య హోమంతో పాటు ప్రత్యేక పూజలు చేయించారు. కుటుంబసభ్యులతో స్వయంగా సంకల్పం చేయించిన విజయేంద్ర సరస్వతి.. కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయంలో సన్యాస దీక్ష ప్రసాదించారు.

శ్రీ గణేశ శర్మ విద్యాభ్యాసం వివరాలు

దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ 1998లో జన్మించారు. అన్నవరంలో సంప్రదాయ వేద శిక్షణతో పాటు పదో తరగతి వరకు చదువుకున్నారు. కర్నాటకకు చెందిన చందుకట్టు హోసమనే రత్నాకర భట్ శర్మ ఆధ్వర్యంలో వేద విద్యను అభ్యసించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితుడు పల్లమూడి సత్య వెంకట రమణమూర్తి వద్ద శబ్ద మంజరి, ధాతు రూపావళి, సమాస కుసుమావళితో పాటు ఇతర సంస్కృత గ్రంథాలను అధ్యయనం చేశారు. వేద వివరణ, సంస్కృత వ్యాకరణాన్ని రుగ్వేద పండితుడు, సంస్కృత ఉపాధ్యాయుడు సతీషాచార్యుల వద్ద నేర్చుకున్నారు.

 కంచి పీఠాధిపతులు జయేంద్రసరస్వతి స్వామి దర్శనం

కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిని 2009లో గణేశ శర్మ తిరుపతిలోని బంధువుల ఇంట్లో  దర్శించుకున్నారు. ఆ సమయంలో ద్వారకా తిరుమలలో సేవ చేస్తున్న రత్నాకర భట్ శర్మ వద్ద వేద విద్యలో చేర్పించమని సూచించారు. గణేశశర్మ అక్కడ చేరి 12 ఏళ్ల పాటు రుగ్వేద సంహిత, ఐతరేయ బ్రహ్మణీయం, ఉపనిషత్తులు నేర్చుకున్నారు. తర్వాత మంత్ర ఉచ్ఛారణలో ప్రావీణ్యం పొందారు. అరసవల్లి సూర్యనారాయణ ఆలయంలో రత్నాకర భట్ కుమారుడు శ్రీనివాస శర్మ మార్గదర్శకత్వంలో వేద గ్రంథాల్లో శిక్షణ పొందారు. తెలంగాణలోని బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో సేవలందించారు. గణేశ శర్మ తండ్రి ధన్వంతరి అన్నవరం ఆలయంలో పురోహితుడిగా పనిచేస్తున్నారు.

తమిళనాడులోని కాంచీపురం నగరంలో కంచి కామకోటి మఠాన్ని ఆది శంకరులు స్థాపించారు. శాంతి, ప్రశాంతత శోధన కోసం ఆది శంకరులవారి భక్తులు ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో మఠాన్ని దర్శించుకుంటారు. 69వ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మహాసమాధి అయ్యారు. ఆ సమయంలో ఉత్తరాధికారిగా ఉన్న విజయేంద్ర సరస్వతి 70వ పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయనే పీఠాధిపతిగా కొనసాగుతున్నారు. తదుపతి ఉత్తరాధికారి ఎంపిక ఆరేళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. దీంతో కొద్ది రోజుల క్రితం గణేశ శర్మను ఉత్తరాధికారిగా ఎంపిక చేస్తూ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *