అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర రక్ష సిడి ఆవిష్కరణ

శ్రీవారు జన్మించిన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం సాయంత్రం ”అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర రక్ష” సిడిని టిటిడి ఎస్‌.వి.రికార్డింగ్‌ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నం రెడ్డి, టిటిడి ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కలిసి ఆవిష్కరించారు.
టిటిడి ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో రూపొందించిన ఈ సిడిలోని కీర్తనలను శ్రీ కె.రామాచారి స్వరపరచగా శ్రీమతి టి.శ్రీనిధి ఆలపించారు. ఈ సందర్భంగా వీరిని దుశ్శాలువ, శ్రీవారి ప్రసాదంతో సన్మానించారు. అనంతరం ఈ సిడిలోని కీర్తనలను శ్రీనిధి గానం చేశారు.
కాగా, ఈ సంకీర్తనలను టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో వుంచారు. భక్తులు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే సౌకర్యాన్ని టిటిడి కల్పించింది.
ఈ కార్యక్రమంలో తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *