తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు స్వామివారు గజ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. భజనలు, కోలాటాల నడుమ స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు.

బుధవారం రాత్రి రాములవారు గజవాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. హైందవ సనాతన ధర్మంలో గజ వాహనానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది.
రాజసానికి ప్రతీక మదగజం. రణరంగంలో గానీ, రాజదర్బారుల్లో గానీ, ఉత్సవాల్లో గానీ గజానిదే అగ్రస్థానం. అటువంటి వాహనసేవలో గజేంద్రుడు శ్రీవారిని వహించునట్లు భక్తులు సదా కోదండరాముని హృదయ పీఠికపై వహించి స్వామికృపకు పాత్రులుకాగలరు.

