తిరుమల ఆలయంలో శాస్త్రోక్తంగా క్షీరాధివాస తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణంలో భాగంగా నాలుగో రోజు బుధవారం ఉదయం శ్రీవారి మూలమూర్తికి ఇతర పరివార దేవతలకు క్షీరాధివాస తిరుమంజనం క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

అధివాసం

విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ సమయంలో విశ్వంలోని శక్తిని ఆవాహన చేసేందుకు అధివాసం నిర్వహిస్తారు. ప్రాణప్రతిష్ట ద్వారా విగ్రహాలు అనంతమైన శక్తిని పొందుతాయి. ఇలాంటి విగ్రహరూపంలో ఉన్న దేవతలను దర్శించడం ద్వారా కోరిన కోరికలు తీరడంతోపాటు మానసిక శాంతి చేకూరుతుంది.

అధివాసం రకాలు

శాస్త్రాల ప్రకారం ఆలయాల ప్రాణప్రతిష్ఠ సమయంలో క్షీరాధివాసం, జలాధివాసం, ఫలాధివాసం, ఛాయాధివాసం, ధాన్యాధివాసం, పుష్పాధివాసం, శయనాధివాసం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు.

క్షీరాధివాసం

శ్రీవారి మూలమూర్తిని పవిత్రమైన పాలతో అభిషేకం చేయడాన్నే క్షీరాధివాసం అంటారు. ”క్షీరసాగర తరంగ శిఖర సార తరకిత చారుమూర్తే” అంటూ ముకుందమాల స్తోత్రంలో శ్రీకులశేఖరాళ్వార్‌ క్షీరాధివాసం వైశిష్ట్యాన్ని తెలియజేశారు.

అద్దంలోని గోపుర శిఖరాల ప్రతిబింబాలకు అభిషేకం

శ్రీవారి ఆలయంలో బుధవారం ఉదయం గోపురాల కలశాలను అద్దంలో చూపి వాటి ప్రతిబింబాలకు అభిషేకం నిర్వహించారు. శ్రీ విమాన వేంకటేశ్వరస్వామి, శ్రీ గరుడాళ్వార్‌, శ్రీవరదరాజస్వామి, శ్రీభాష్యకారులు, శ్రీ యోగనరసింహస్వామివారికి, ధ్వజస్తంభం, శ్రీ బేడి ఆంజనేయస్వామివారి గోపురాల కలశాలకు ఈ విధంగా పవిత్రమైన జలం, పాలతో అభిషేకం చేశారు.

ఉదయం పవిత్ర జలం, పాలు, పంచగవ్యాలతోకూడిన 14 కలశాలతో శ్రీవారి మూలమూర్తికి, ఇతర పరివార దేవతలకు క్షీరాధివాస తిరుమంజనం, మధ్యాహ్నం మహాశాంతి పూర్ణాహుతి, మహాశాంతి తిరుమంజనం జరిగింది. శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం 10.16 నుండి 12 గంటల వరకు మహాసంప్రోక్షణం నిర్వహించారు.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *