శ్రీశైలంలో వైభవోపేతంగా ముగిసిన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో సంక్రాంతి సంబంరాలు అంబరాన్నంటాయి. ఈ నెల 12వ తేదీ నుంచి 18 వరకు జరిగిన మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. 12వ తేదీన యాగశాల ప్రవేశం, ధ్వజారోహణంతో మహోత్సవాలు ప్రారంభమై ప్రతి రోజు శ్రీస్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వాహన సేవలు, గ్రామోత్సవం నిర్వహించారు.

శ్రీశైలంలో వైభవోపేతంగా ముగిసిన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

15వ తేదీన మకర సంక్రాంతిని పురస్కరించుకుని శ్రీగంగా పార్వతీ సమేత మల్లికార్జున స్వామివార్ల లీలాకల్యాణోత్సవం భక్తజనుల కోలాహలం మధ్య అత్యంత రమణీయంగా జరిగింది. సంక్రాంతి మహోత్సవాల సందర్భంగా 12 నుంచి 18 వరకు శాశ్వత, ఆర్జిత సేవలైన కల్యాణం, రుద్రహోమం, గణపతి హోమం, నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, ఏకాంత సేవ, సర్వసేవా పథక సేవలను చేశారు.

ఉత్సవాలలో భాగంగా శ్రీపార్వతీ సమేత మల్లికార్జునస్వామికి వైభవంగా నిర్వహించిన పుష్పపల్లకి సేవ భక్తజనం, కళాకారుల సందడి నడుమ కోలాహలంగా జరిగింది. శ్రీ భ్రమారాంభ మల్లికార్జున స్వామి ఆలయంలోని అక్కమహాదేవి మండపంలో దేవ దేవేరులను రావణ వాహనంలో ప్రత్యేక వేదికపై అలంకరించారు. సుగంధ ద్రవ్యాలు, వివిధ రకాల పుష్పాలతో పూజలు నిర్వహించిన అర్చకులు, వేద పండితులు స్వామి వార్లకు ప్రత్యేక హారతులిచ్చారు. మేళతాళాల నడుమ, ఆలయ పురవీధుల్లో అశేష భక్తజనుల నడుమ స్వామి వారు పురవీధుల్లో విహరించారు. భక్తులు పారవశ్యంతో నీరాజనాలర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *