ఘనంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్పణ

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలకు గురువారం సాయంత్రం ఘనంగా అంకురార్పణ జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. సాయంత్రం 6.00 గంటల నుండి పుణ్యహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం జరుగనుంది.

padmavati devi

కాగా ఏప్రిల్‌ 27 నుండి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు వసంతోత్సవాలు వేడుకగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఈ మూడు రోజులపాటు సాయంత్రం 3.00 నుండి 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 29వ తేదీ ఉదయం 7.30 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నుల పండువగా జరుగనుంది. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో తిరుచ్చిపై అమ్మవారిని ఘనంగా ఊరేగించనున్నారు.

గృహస్త భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి ఒక రోజు వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న భక్తులకు ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు. వసంతోత్సవం సందర్భంగా ఆలయంలో మూడు రోజుల పాటు ఆర్జిత సేవలైన లక్ష్మీపూజ,కల్యాణోత్సవం, ఊంజలసేవను రద్దు చేశారు. ఆలయం వద్దనున్న ఆస్థాన మండపంలో ప్రతిరోజూ సాయంత్రం హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *