సత్సంతానం కోసం గరుడపంచమి వ్రతం

నాగ పంచమిరోజే గరుడ పంచమి కూడా వస్తుంది. గరుడ పంచమి వెనుక ఉన్న పురాణగాధ ఏమిటంటే… కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వినతకి గరుత్మంతుడు జన్మించగా, కద్రువ కడుపున సర్పజాతి జన్మించింది. అందువలన సర్పజాతి జన్మించిన శ్రావణశుద్ధ పంచమి ‘నాగ పంచమి’గా పిలవబడుతోంది. ఇక ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కనుక, అదే పంచమిని ‘గరుడ పంచమి’ అని కూడా పిలుస్తుంటారు. గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని ఈ రోజున గరుడ పంచమి వ్రతం చేస్తుంటారు.

వ్రత నియమాలు…

అయితే సోదరులు వున్న స్త్రీలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం వుంది. సౌభాగ్యంతో పాటు చక్కని సంతానాన్ని ఇచ్చే ఈ వ్రతంలో గౌరీదేవి పూజలు అందుకుంటుంది. విశేషమైనదిగా చెప్పబడుతోన్న ఈ వ్రతాన్ని పది సంవత్సరాల పాటు ఆచరించి, ఆ తరువాత ఉద్యాపన చెప్పుకోవలసి వుంటుంది.

సాధారణంగా ఏ తల్లి అయినా తన కొడుకు తాను గర్వించేలా, లోకం మెచ్చేలా వుండాలని అనుకుంటుంది. అలా తన తల్లికి దాస్యం నుంచి విముక్తి కలిగించడం కోసం గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత కలశం తీసుకువచ్చాడు. అందుకోసం దేవేంద్రుడితోనే పోరాడాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అభినందనలను అందుకుని ఆయన వాహనంగా ఉండిపోయాడు. అలాంటి ఈ రోజున గరుడ పంచమి వ్రతాన్ని ఆచరించడం వలన, ఆరోగ్యవంతులైన, ధైర్యవంతులైన సంతానం కలుగుతుందని చెప్పబడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *