శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా సాత్తుమొర

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆదివారం శ్రీచక్రత్తాళ్వార్‌ సాత్తుమొర, శ్రీ ప్రతివాది భయంకరన్‌ అన్నన్‌ సాత్తుమొర ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి ఆలయం నుంచి ఉదయం 8.00 నుంచి 9.30 గంటల వరకు ఉభయనాంచారులతో కూడిన శ్రీ వరదరాజస్వామివారు, శ్రీ ప్రతివాది భయంకరన్‌ అన్నన్‌ ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు తిరుమల నుంచి వచ్చిన శ్రీవారి అప్పపడి ప్రసాదాన్ని శ్రీకోదండరామాలయం నుంచి శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి సాత్‌మొర నిర్వహించారు.

సాయంత్రం 4.00 నుండి 5.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని, శ్రీ చక్రత్తాళ్వార్‌ను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఆండాళ్‌ అమ్మవారి ఊరేగింపు ఉంటుంది.

ప్రాశస్త్యం 

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని మొదటి గోపురంలో పవిత్రమైన పుష్యమి నక్షత్రం రోజున శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను ప్రతిష్ఠించారు. స్వామివారి ప్రతిష్టాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ చక్రత్తాళ్వార్‌ సాత్తుమొరను నిర్వహించడం ఆనవాయితి.

శ్రీ ప్రతివాది భయంకర అన్నన్‌ కాంచిపురంలో జన్మించారు. ఆయన సంస్కృత పండితులు, శ్రీవైష్ణవాచార్యులు. తిరుమల శ్రీవారిని మేల్కొలిపే సుప్రభాతాన్ని, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనమును అద్భుతంగా రచించారు. అంతేగాక శ్రీ భాష్యం, శ్రీ భాగవతం వంటి మహా గ్రంథాలకు వ్యాఖ్యానం రచించారు. వీరి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆరోజున సాత్తుమొర నిర్వహించడం ఆనవాయితి.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *