శివాయ విష్ణురూపాయ: రామనామముఉత్కృష్టత

రామనామము యొక్క ఉత్కృష్టతను, రామనామస్మరణ వలన కలిగే సత్ఫలితాలను కంచి కామకోటి పీఠానికి 69వ పీఠాధిపతి అయిన శ్రీ శ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామి ఇలా ఉద్భోధించారు.  భగవన్నామస్మరణ, విశేషంగా రామ నామస్మరణ వ్యక్తికి అమిత ప్రయోజనాన్ని సిద్ధింపచేస్తుంది. అది మనోమాలిన్యాలను కడిగివేస్తుంది. మనస్సు దోషభూయిష్టమైనప్పుడు రామనామజపం చేస్తే అది దోష రహితమై స్వచ్ఛతను చేకూర్చుకుంటుంది. వాల్మీకి రామాయణాన్ని సంస్కృతంలో రచిస్తే తులసీదాసు దాన్ని హిందీలోకి అనువదించారు. ఇరువురు మహాత్ములయొక్క జీవితచరిత్రలు రామనామం యొక్క ఉత్కృష్టతను వివరంగా ఉల్లేఖిస్తాయి. 

బందిపోటు నుంచి మహర్షిగా…

వాల్మీకి జీవితాన్ని పరిశీలిస్తే ఒక వ్యక్తియొక్క జీవితాన్ని రామనామం ఏవిధంగా తారుమారు చేసి ఉన్నత గమ్యాలకు చేర్చగలదో మన మెరుగగలం. బందిపోటు దొంగగా జీవితాన్ని ఆరంభించిన ఒక బోయవాడు రామనామ ఫలితంగా మహర్షి స్థాయికి ఎదిగాడు.

వాల్మీకి అడవిలోకి వచ్చిన జనుల సొత్తును దోపిడీచేసి జీవించేవాడు. ఒక రోజున సప్తర్షులు అడవికి వెళ్ళారు. వాల్మీకి వారిని కూడ సమీపించి వారి వస్తువులను కూడ బలవంతంగా తీసికోవటానికి ఉద్యుక్తుడయ్యాడు. అప్పుడు మహర్షులు అతనితో ”ఇతరులను బాధించి వారి వస్తువులను తీసుకుని వారికి ఇబ్బంది కలుగచేస్తున్నావు.” అనగానే వాల్మీకి దానికి సమాధానంగా నేను పెద్ద కుటుంబీకుడను. నాకు తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, ఇతర బంధువులు ఉన్నారు. వారి పోషణ బాధ్యత నాదే. వారందరి ఆకలి తీర్చడానికి నేనిలా ప్రజలను హింసించి వారి సొత్తును తీసుకోవలసిందే.” అన్నాడు. అప్పుడు వారు ”నీవు వారందరికీ ఆహారం సమకూర్చవలసిందే. కానీ నీవు అవలంబిస్తున్న మార్గం చాలా తప్పిదమైంది, పాపసమన్వితమైంది.

నీవు చేసే పాపకార్యం యొక్క ఫలితం నీవు అనుభవించవలసిందే కానీ నీవల్ల పోషింపబడుతున్న నీ కుటుంబీకులు ఒక్కరు కూడ నీ పాపంలో పాలుపంచుకోరు. దోపిడీ అనే పాపకార్యాన్ని చేసి నీ కుటుంబాన్ని పోషించే ఉద్యమం మంచిదికాదు. కనుక ఇకనుండి యీ పాపకృత్యాల్ని విరమించు” అని మహర్షులన్నారు. అప్పుడు వాల్మీకి ”నేను ఈ విధమైన దోపిడీ చాలాకాలం నుండి చేస్తున్నాను.” ఈ పరిస్థితి నుండి నాకు బైటపడే మార్గం ఏమిటి” అని అడిగాడు. దానికి మహర్షులు వాల్మీకితో ”నీవు ఈ రోజు నుంచి రామనామజపం చేయటం ఆరంభించు. నీవింతవరకూ చేసిన పాపాలన్నింటికి దానివలన నిష్కృతి కలుగుతుంది.” అన్నారు.

ఆ విధంగా మహర్షుల వలన ఉపదేశం పొందిన వాల్మీకి అడవిలోకి వెళ్ళి దోపిడీ చేయడం పూర్తిగా విరమించాడు. అందుకు బదులు అతడొక ఏకాంత ప్రదేశంలో కూర్చొని నిష్ఠతో రామనామజపం అన్నివేళలా చేయడం ఆరంభించాడు. అతడలా ఒకచోట ఆసీనుడై ఎంతకాలం రామనామజపం చేశాడో కాని, అతని శరీరంపై చీమలపుట్ట పెరిగి అతన్ని పూర్తిగా మరుగుపరిచింది. అతడా పుట్టనుంచి బయటకు వచ్చిన తర్వాత వాల్మీకి మహర్షిగా పిలువబడ్డాడు. వల్మీకం అనగా పుట్ట. దానినుండి వెలువడినందువలన ఆయనకు వాల్మీకియని నామధేయం సార్ధకమైంది.

రామనామ జపం ద్వారా సాధించిన రామానుగ్రహం వల్ల బందిపోటు దొంగ జ్ఞానియై మహర్షిగా పరిణమించాడు. అతని పూర్వపు పాపాలన్నీ ప్రక్షాళితమైనాయి. నిశ్చయంగా ఈ అధునాతన కాలంలో చదువను, వ్రాయను నేర్చిన మనం వాల్మీకి కంటె చాల తెలివైనవారమే. కాబట్టి మనం రామనామజపంలో కొంతకాలాన్ని వెచ్చిస్తే మన సమస్యలకు పరిష్కారాలు సులభంగా లభిస్తాయి. సామాన్యుడైన వాల్మీకి యొక్క పాపాలు రామనామజపం చేత ప్రక్షాళింపబడినప్పుడు, మన పాపాలకు కూడ నిశ్చయంగా నిష్కృతి లభిస్తుంది.

తర్వాత జీవితాల్ని ప్రకాశవంతం చేసుకొనుటకు వాల్మీకి మార్గాన్ని నిర్దేశించాడు. ప్రతివ్యక్తి రామనామం జపాన్ని కొన్ని వేళల్లో అయినా చేస్తే అతనికి రామచంద్రుని అనుగ్రహం తప్పక లభిస్తుంది. 

బాల్యం నుండే రామనామం వ్రాయించండి

త్యాగబ్రహ్మ, రామదాసు, సమర్ధరామదాసు, తులసీదాసు మొదలైన మహాత్ముల జీవితాలు ఆదర్శప్రాయంగా మనముందున్నాయి. వారి దైనందిన జీవితాలు ప్రతినిత్యం రామనామం చుట్టూ పరిభ్రమించాయి. ఈ రామనామానికి ప్రజలకు మనశ్శాంతిని ప్రసాదించే శక్తి ఉంది.

పిల్లలకు బాల్యం నుండే రామనామం వ్రాసే సదభ్యాసాన్ని అలవరచాల్సిన అవసరం ఉందని నిరూపించే కారణాల్లో ఇది కూడ ఒకటి. ఒక కుటుంబంలోని సభ్యులందరూ ఈ అభ్యాసాన్ని అలవరుచుకుంటే వారి కష్టాలు ఉపశమిస్తాయి. వారి జీవితాలు సుఖశాంతులతో వర్ధిల్లుతాయి. కనుక అందరూ రామభక్తిని అభ్యసించి రామనామం వ్రాస్తూ సుఖింతురుగాక. రామాయణ ప్రవచనాల్ని వినాలి. రామనామం జపించాలి. రామచంద్రుడు అమలుచేసి చూపిన ధర్మాల్ని పాటించాలి. ఇవి సవ్యంగా నిర్వర్తిస్తే మనకు సిద్ధించే ప్రయోజనాలు అనంతం అని జయేంద్రవాణిలో తెలియచేసారు.

రాముని గుణాలు అలవరచుకోవాలి

రామునియొక్క మాతృభక్తిని, పితృభక్తిని, గురుభక్తిని, స్నేహశీలతను, శరణాగతవాత్సల్యాన్ని-ఈ సద్గుణాలన్నింటినీ మనం చిత్తశుద్ధితో అనుకరించాలి. రాముడు తనయొక్క అవతార జీవితంలో ఈ ధర్మాలనన్నింటిని దృష్టాంతీ కరించాడు. రామకథ వినటంలో విశేషంలేదు. అంత మాత్రంచేత మోక్షం సిద్ధించదు. అందులో రాముడు అవలంబించిన ధర్మాల్ని మనంకూడ మన జీవితంలో అమలు చేయగల్గితేనే మన దుఃఖాలు ఉపశమించి మనకు మానసికశాంతి చేకూరుతుంది. శ్రీరామచంద్రమూర్తి ధర్మాన్ని అనేకమార్గాల్లో అవలంబించి మన జీవితాలకు ఒక ఆదర్శమూర్తియై మనముందు నిలిచాడు.

రాముని నామం కూడ విశేష ప్రాముఖ్యం గలది. ప్రజలను సౌఖ్యానందాలతో రమింపచేయువాడు గనుక రాముడైనాడని లోగడ చెప్పుకున్నాం. గణేశుడు కూడ మనకు సుఖాల్ని ప్రసాదించే దేవతే. ఐతే రాముని విషయంలో ఆయన పేరులోనే ‘సౌఖ్యప్రదాత’ అనే అర్థం ఇమిడిఉంది. దేవతల్లో కూడా ఒక్కొక్క దేవత ఒక్కొక్క రకమైన కోర్కెలను తీరుస్తుంది. గణేశుడు మనకు సంభవించే విఘ్నాలను నివృత్తి చేస్తాడు.

శివుడు మోక్షాన్ని, లక్ష్మీదేవి సంపదలను అనుగ్రహిస్తారు. అలాగే రాముడు శాశ్వత సుఖాన్ని మనకు ప్రసాదించే ప్రత్యేక శక్తికలవాడు. మనం ప్రాపంచిక వ్యవహారాల్లో ఏ కార్యాన్ని నిర్వహించినా మన అంతిమ లక్ష్యం సౌఖ్యమే. అర్థరహితమైన ఈ మాయా ప్రపంచంలో అర్థసహితమైనది రామనామమే. ప్రతివిషయానికి సారాంశం రామనామం. మిగతా విషయాలన్నీ నిష్ప్రయోజనాలే. రామనామ ఉచ్చారణతో దు:ఖోపశమనం, సుఖాగమనం ఏకకాలంలో జరుగుతాయి.

కనుక కుటుంబ సభ్యులందరు ఉదయం లేచి కాలకృత్యాలు పూర్తిచేసికొని అందరూ ప్రార్థనామందిరంలో సమావేశమై రామవిగ్రహం ముందు కొద్ది నిముషాలపాటైన రామనామజపం లేక భజన చేసిన తర్వాతనే వారి వారి లౌకిక వృత్తుల్లోకి ప్రవేశించాలి. అప్పుడే మన పనులన్నీ శీఘ్రంగా ఫలిస్తాయి. సమయమున్నవారు ఉదయం, సాయంత్రం కూడ రామాలయానికి వెళ్ళి దైవదర్శనం చేసికొని రామనామ జపం చేయగల్గిన మంచిదే. లేనిచో ఎవరింట్లో వారు రామనామ జపంచేసి సుఖశాంతుల్ని పొందవచ్చు. రామచంద్రుని అనుగ్రహం మన అందరిపై ప్రసరించుగాక.

రామనామము యొక్క ఉత్కృష్టతను గురించి వివరిస్తూ…రామనామ జపం కంటే రామనామం వ్రాయటం విశేషమైందని నా అభిప్రాయం. రామనామం వ్రాసే సమయంలో కళ్ళు, చేతులు, మనస్సు ఆ పనిలో నిమగ్నమవుతాయి. నామజపంలో అలాగాక ఒక్క మనస్సు మాత్రమే దానిలో లగ్నమై యుంటుంది. కళ్ళు, చేతులు ఇతర విషయాలలోను, కార్యాలలోను పరిభ్రమించవచ్చు.

రామనామం వ్రాయటం వల్ల అనేకమైన ప్రయోజనకరమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఎవరి గృహాల్లో వారు తమ పూజామందిరంలో రామనామం వ్రాసి ఉంచు కుని ప్రతిదినం పూజలు చేయవచ్చు. తమ గృహాల్లో అలా పూజ చేయటానికి వసతులు లేనివారి కొరకు మాత్రమే వాటిని మా మఠాల్లో ఉంచుతాం. శ్రీ నారాయణజియ్యర్‌ వారు ఒకప్పుడు రామనామం వ్రాతల సముదాయాన్ని సమీకరించి వారి మఠమందుంచి ఆరాధించే ఏర్పాట్లు చేశారు. మా మఠం తరపున మేము పిల్లలను రామనామం వ్రాయుటకు ప్రోత్సహించే ఉద్దేశ్యంతో వారికి ఒక్కొక్కరికీ ఒక నాణాన్ని ఇచ్చే నియమం పెట్టాం. పైమఠాలు రెండూ ఒకే పనిని నిర్వహించటంలో పోటీపడ్డట్టు కనిపించినా మా లక్ష్యం మాత్రం రామభక్తివైపు ప్రజలను మరల్చటం, అందరూ రామనామ స్మరణతో, రాముడనుసరించిన ధర్మాలను పాటించేటట్లు చేయటం మాత్రమే. ప్రజలందరూ అలాంటి ప్రవర్తనపై ఆసక్తి చూపి నడచుకుంటే రామరాజ్యావతరణ సుగమం కావటంలో ఆశ్చర్యంలేదు.

రామాయణ పఠనం

రామనామము యొక్క ఉత్కృష్టతను తెలియచేస్తూ… రామాయణ పారాయణం అమిత శ్రేయో దాయకమని పెద్దల వాక్కు.

శ్లో|| సర్వపాపై: ప్రముచ్యేత పదమప్యస్య య: పఠేత్‌ |

పాపాన్యపి చ య: కుర్యాదహన్యహని మానవ:

పఠత్యేకమపి శ్లోకం పాపాత్‌ స: పరిముచ్యతే |

య: పఠేత్‌ శృణుయాన్నిత్యం చరితం రాఘవస్య హ |

భక్త్యా నిష్కల్మషో భూత్వా దీర్ఘాయురనాప్నుయాత్‌ ||

రామాయణ పఠనం వల్ల మాటలు రాని పిల్లలు కూడ ధారాళంగా మాట్లాడగల్గుతారు. వారి వాక్కు శక్తివంతమౌతుంది. సరస్వతీదేవిని ఆరాధిస్తే ఏ సత్ఫలితాలు సమకూరుతాయో అవే ఫలితాలు దీనివల్ల లభిస్తాయి. నిజంగా, రామాయణం వాల్మీకి ద్వారా ప్రవహించిన సరస్వతీవాక్కు మాత్రమే. ఒకవ్యక్తి రామాయణాన్ని పలుమార్లు పఠించడం వల్ల అతని భాషణాపటిమను పెంపొందించుకోగలడు. రామాయణ పారాయణం వల్ల లభించే ఫలితాలు అనంతం.

రామేశ్వరం ఆవిర్భావం

రామనామము యొక్క ఉత్కృష్టత జయేంద్ర సరస్వతి స్వామి గురించి చెపుతూ…దక్షిణ భారతంలో రామేశ్వరమనే ప్రపంచ విఖ్యాతిచెందిన దివ్యపుణ్య క్షేత్రముంది. ఆ దేవాలయ అధిష్టాన దేవతపేరు రామనాథేశ్వరుడు. ఒకప్పుడు దేవతల మధ్య రామేశ్వర శబ్దానికి సరియైన అర్థమేమిటనే మీమాంస తలెత్తింది. ఆ శబ్దం ఎలా ఏర్పడింది, దానిలోని రామ, ఈశ్వర అనే విభిన్న పదాల కలయికకు ఏ సమాసం వర్తిస్తుంది. అనే విషయాలు వారు తెలుసుకోగోరారు.

ఆ సందర్భంలో చెప్పబడిన శ్లోకాన్ని చూడండి :

శ్లో|| విష్ణుస్తత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వర: |

ఉభయోరప్యతృప్తానామాత్మభూ: కర్మధారయమ్‌ ||

వారిలోని శైవమతావలంబకులు ”రామస్య ఈశ్వర:=రామేశ్వర:” . అది తత్పురుష సమాసం అవుతుంది. దాని అర్థం రాముడు ఈశ్వరుని కంటె భిన్నమైనవాడు, మరియు ఈశ్వరుడు రామునికంటె అధికుడు అన్నారు. వారిలోని వైష్ణవులు శైవులతో విభేదిస్తూ అది బహువ్రీహి సమాసం అని నిర్ధారించారు. ‘రామః ఈశ్వరః యస్య సః రామేశ్వరః’ ఎవరికైతే రాముడు ఈశ్వర స్వరూపుడో అని దాని భావం. దీని ననుసరించి రాముడు ఈశ్వరునికంటె అధికుడని, లేక రాముడే ఈశ్వరుడని తేలుతుంది. ఇలా విరుద్ధమైన అభిప్రాయాలు వెలువడడంతో వారు ఇదమిత్థమని నిర్ణయించలేకపోయారు. ”సీతోద్వాహ సమయంలో రాముడు శివధనుస్సును భంగం చేశాడు కదా! కనుక శివుడు రామునకు ఈశ్వరుడెట్లా అవగలడు?” అనే ప్రశ్న వారికి ఉదయించింది.

దీని పరిష్కార మార్గం వారికి లభించక, రామావతారాన్ని దాల్చిన విష్ణువును అడగాలని వైకుంఠానికి వెళ్ళారు. అచ్చట విష్ణువును దర్శించి ప్రణమిల్లి ఆయన్ని ”రామేశ్వర సమాసం లోని విగ్రహవాక్యాల విషయంలో వ్యాకరణవేత్తలు మా సందేహాన్ని తీర్చలేకపోయారు. దానిని వివరించమని కోరుతున్నాం.” అని అడిగారు. ”అందులో సందేహానికి అవకాశమేలేదు. అది తత్పురుష సమాసం మాత్రమే.” అని విష్ణువు సమాధానమిచ్చాడు.

”నాకు గూడ శివుడు ఈశ్వరుడే” అని విష్ణువన్నాడు. కాని వారిలోని వైష్ణవులు దానిని ఆమోదించలేదు. నమ్రత విష్ణువునకు స్వాభావికం. కనుక ఆ భావంతోనే శివుడు తనకంటే ఉన్నతుడంటున్నాడు. అని వారు భావించారు.

అప్పుడు వారు కైలాసానికి ఈశ్వరుని ముందే ఈ సమస్య నుంచుదామని నిశ్చయించుకుని ఆయన సన్నిధికి వెళ్ళారు. ఆయనకు ప్రణమిల్లి రామేశ్వర శబ్దంలోని సమాస ప్రక్రియను విపులీకరించమని ప్రాధేయపడ్డారు. సమాధానంగా ఈశ్వరుడు వారితో ”ఇది బహువ్రీహి సమాసమే” నన్నాడు.

రామేశ్వరః = రామః ఈశ్వరః యస్య సః 

అనగా ”ఎవరికైతే రాముడు ఈశ్వరుడో అతడు రామేశ్వరుడు” అని చెప్పాడు. దేవతల్లో ఇప్పుడు ఇంకా ఎక్కువ సంఘర్షణ మొదలైంది. పై రెండు వివరణలలోని వైరుద్ధ్యాన్ని సమన్వయ పరచుకోలేకపోయారు. శివకేశవులిరువురు వారి వారి నమ్రతా భావాలతో తనకంటె రెండవవాడు అధికుడని ప్రకటిస్తున్నారని వారు భావించారు. తటస్థవైఖరి నవలంబించే మరియొకరి నిర్ణయాన్ని సేకరించాలని తలంచి బ్రహ్మను సమీపించారు.

బ్రహ్మ వారి సమస్యనాలకించి ”ఆ సమాసం కర్మధారయం ఔతుంది. అన్నాడు.” ”రామశ్చాసౌ ఈశ్వరశ్చ రామేశ్వర:’. ”రాముడు, ఈశ్వరుడు అని భిన్నభిన్న ప్రకృతులు లేవు. ఇరువురు ఒకటే.” అని బ్రహ్మగారి తీర్పు.

రాముడు, ఈశ్వరుడు ఇరువురు ఉన్నతులే. ఇరువురు సత్యస్వరూపుడైన పరమాత్ముని అంశలే. రామునకు, శివునకు మధ్య ఏమీ వైరంలేదు. మానవుల అజ్ఞానం వలన పరమాత్మయొక్క నిజమైన తత్వాన్ని తెలియలేక వారు సృష్టించుకున్నవే ఈ వివాదాలు. ఉదాహరణకు రాముడు, పరశురాముడు విష్ణువుయొక్క అవతారాలే. ఐనా ఒకరితోనొకరు యుద్ధంచేసినట్లు వింటాం. అది నిజమైంది కాదని మనం తెలుసుకోవాలి.

దైవం ఎన్ని రూపాల్లో కనిపించినా అవన్నియూ పరమాత్మయొక్క భిన్న భిన్న అవతారాలే. ఒక్కొక్క అవతారం ఒక ప్రత్యేకమైన ప్రయోజనంతో ఉంటుంది. కనుక మనం భగవంతుని ఎలా ఆరాధించినా పరమాత్ముని మాత్రమే ఆరాధించినట్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *