శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆచార్య ఋత్విక్‌వ‌ర‌ణం


తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 30 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్న నేప‌థ్యంలో బుధ‌వారం అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మంలో భాగంగా ఉదయం శాస్త్రోక్తంగా ఆచార్య ఋత్విక్ వ‌ర‌ణం నిర్వ‌హించారు.





శ్రీవారి మూలవిరాట్‌ ఎదుట ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వ‌హించారు. ఇందులోభాగంగా భగవంతుని ఆజ్ఞ మేరకు అర్చకులకు బాధ్యతలు కేటాయించారు.





ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసి కొన్ని, తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.





ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు పవిత్ర ప్రతిష్ఠ, రెండో రోజు పవిత్ర సమర్పణ, చివరిరోజు పూర్ణాహుతి నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారిని ఆల‌యంలోని రంగ‌నాయ‌క మండ‌పంలో వేంచేపు చేస్తారు.





క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా శ్రీ‌వారి ప‌విత్రోత్స‌వాల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.





అంకురార్పణం





శ్రీవారి పవిత్రోత్సవాలకు బుధ‌వారం రాత్రి 7 నుంచి 8 గంటల నడుమ అంకురార్పణం జరుగనుంది. ముందుగా సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సేనాధిపతివారిని ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల ‌మండపానికి వేంచేపు చేసి మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహిస్తారు. ఆ తరువాత పవిత్రమండపంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపడతారు.





దోష నివారణ ఉత్సవాలు





పవిత్రోత్సవాలను ‘దోష నివారణ’, ‘సర్వయజ్ఞ ఫలప్రద’, ‘సర్వదోషోపశమన’, ‘సర్వతుష్టికర’, ‘సర్వకామప్రద’ తదితర పేర్లతో పిలుస్తారు. పవిత్రం, ఉత్సవం అనే రెండు పదాల కలయిక వల్ల పవిత్రోత్సవం ఏర్పడింది. చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీస్వామివారి ఉత్సవమూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికిగాను శ్రేష్ఠమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవమొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం.





పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారంగానీ లేదా 200 మూరల నూలుదారం గానీ ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దకం చేస్తారు. ఆలయ మొదటి ప్రాకారంలో గల వగపడి వరండాలో ఉత్తరం వైపున రాతి గోడపై పవిత్రోత్సవాల లెక్కలకు సంబంధించిన పురాతన శాసనం లభ్యమైంది. ”పవిత్ర తిరునాల్‌” పేరిట నిర్వహించిన ఈ ఉత్సవాల్లో ఉపయోగించిన వస్తువుల జాబితా, వాటి ధరల వివరాలున్నాయి.





Source


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *