వైభవంగా శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి స్నపన తిరుమంజనం

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు నిర్వహిస్తున్న స్నపనతిరుమంజనం(పవిత్రస్నానం) నాల్గవ రోజైన శుక్రవారం శోభాయమానంగా జరిగింది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు ఆలయంలోని కల్యాణ మండపంలో ఈ వేడుక వైభవంగా జరిగింది.

snapanam

ప్రధాన కంకణభట్టర్‌ శ్రీ బాలాజి రంగాచార్యులు ఆధ్వర్యంలో ఈ విశేష ఉత్సవం నిర్వహించారు. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖనస ఆగమయుక్తంగా నిర్వహించారు.

snapana tirumanjanam

ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే పాశురాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున మొత్తం ఏడు రకాల మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఇందులో కురువేరు(వట్టివేరులో ఒకరకం), వట్టివేరు, ఐదు రకాల పూలు రోజా పూలు, సంపంగి, చామంతి, తులసి, గులాబి మాలలు స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *