శ్రీనివాసమంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వసంతోత్సవాల వైభవం

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు మే 07 నుండి 09వ తేదీ వరకు భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుగనున్నాయి.

ఈ ఉత్సవాల్లో భాగంగా మే 08న సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు స్వర్ణ రథంపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిస్తారు. ఈ మహోత్సవం భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదించనుంది.

ప్రతి రోజు ఉత్సవమూర్తులను వసంత మండపానికి వేంచేపు చేసి మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు స్నపన తిరుమంజనం, అనంతరం సాయంత్రం ఊంజల్ సేవ, వీధి ఉత్సవాలు నిర్వహిస్తారు. తొలి రెండు రోజుల పాటు శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవాలలో పాల్గొనడం విశేషం.

చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారితో పాటు శ్రీరామచంద్ర మూర్తి, సీత, లక్ష్మణ, ఆంజనేయస్వామి, అలాగే శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపుగా తీసుకువచ్చి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం, ఆస్థానం నిర్వహిస్తారు.

వసంత ఋతువులో లభించే పుష్పాలు, ఫలాలతో స్వామివారిని ఆరాధించడం ద్వారా భక్తులు దివ్యానుగ్రహాన్ని పొందడమే ఈ వసంతోత్సవాల అంతరార్థమని అర్చకులు తెలిపారు.

ఈ సందర్భంగా మే 07 నుండి 09వ తేదీ వరకు ఆలయంలో నిత్య కల్యాణోత్సవం ఆర్జిత సేవను, అలాగే మే 07న తిరుప్పావడ సేవను టీటీడీ రద్దు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *